సత్ర విచిత్రంBack to list

సత్ర విచిత్రం

నేను ఇరవై ఏళ్ళు ఊర్లో పెరిగినా ఇప్పటికీ ఒక్కసారి కూడా చూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.దూరపు కొండలు నునుపు అని, ఎక్కడెక్కడో ఉండే చారిత్రక ప్రదేశాలని చూడటానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళతాం. కానీ మనం పుట్టిన ఊరులో ఉన్న చారిత్రక ప్రదేశాలని మాత్రం విస్మరిస్తూ ఉంటాం.చిన్నపట్నుంచి కొన్ని వేల సార్లు సత్రం సెంటర్ అనే పదాన్ని ఉపయోగించి ఉంటాం. కానీ నేను ఖచ్చితం గా చెప్పగలను,ఈ కధనం చదువుతున్న వాళ్ళలో నూటికి తొంభైమంది సత్రం మాత్రం చూసి ఉండరు.

  అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కానీ ఎందుకో ఆ సత్రం ఎలా ఉంటుందో లోపల  చూడాలనే కుతూహలంతో ఆ మధ్య ఊరు వెళ్ళినప్పుడు మందుల షాపు వాసు గారిని అడిగాను. అడిగిందే తడవుగా అయన నాతో పాటు బయలుదేరి ఆ సత్రం లోపలి ఆవరణని, విశేషాల్ని, భవిష్యత్తు కార్యాచరణని వివరించారు. ఎన్నో సార్లు ఆ సత్రం ముందు నుంచి నడిచినా ఒక్కసారిగా లోపల చూసేటప్పటికి ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళిన అనుభూతి. ఏమిటో చెప్పకుండా ఆ ఫోటో చూపిస్తే మాత్రం మన ఊరు వాళ్ళు ఒక్కళ్ళు కూడా అది మన ఊర్లో బిల్డింగ్ అని అనుకోరు.
1928 లో మన గ్రామానికి వచ్చే యాత్రికుల నివాసం కోసం చుండూరి నాగభూషణం గారు ఈ సత్రాన్ని కట్టించారు. అప్పట్లో దీనికి అయినా ఖర్చు 6000 రూపాయలు. దీనికి ఉపయోగించిన  కారురాయి ఇప్పుడు ఎక్కడా దొరకదు. అందుకే ఇన్నేళ్ళయినా ఆ నిర్మాణం చెక్కు చెదరలేదు. తదనంతర కాలం లో నాగభూషణం గారి కుమారుడు చుండూరి వెంకటరెడ్డి గారు సున్నం వేయించి మరమ్మత్తులు చేయించారు. ప్రస్తుతం వీరి వారసులు ఎవరూ లేరు. అందుకీ ఈ సత్రాన్ని గ్రామంలో వైశ్య సంఘానికి అప్పగించారు. వారి ఆధ్వర్యం లోనే ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఏదైనా చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి,ఆధ్యాత్మిక ప్రవచన భోధనా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి దీనిని ఉపయోగిస్తున్నారు. గ్రామంలో పాత భవనాలన్నీ ఇటీవల కొత్త అందాల్ని సంతరించుకుంటున్న తరుణంలో త్వరలో సత్రం కూడా తన రూపుని మార్చుకోబోతుంది.
  దీని గురించి పూర్తి వివరాలని ఇక్కడ వ్యాఖ్యానించలేను కానీ, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో కళ్యాణ మండపం గ్రామ నడిబొడ్డున తలెత్తుకు చూస్తుందని మాత్రం చెప్పగలను. ఆ తరువాత ఈ పాత నిర్మాణాన్ని చూసే అవకాశం ఈ తరానికి ఉండకపోవచ్చు. అందుకే ఆ సత్ర చిత్రాలు ముందుగానే పదిలపరచబడ్డాయి.
 
Dated : 16.06.2012
 

 

 

This text will be replaced