ఘంటసాల పాలెం గ్రామం లో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 19.12.2011 న ప్రారంభించారు. పాలెం వాస్తవ్యులు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అయిన శ్రీ జాస్తి బలరామకృష్ణమూర్తి గారు దాదాపు 15 లక్షల రూపాయల వ్యయం తో దీనిని నిర్మించారు.తాను పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలనే తలంపుతో గ్రామస్తుల అభీష్టం మరియు అవసరాల మేరకు అందరికి ఉపయోగం గా ఉండాలనే ఆశయంతో తనకు జన్మ నిచ్చిన తల్లిదండ్రుల పేరిట తన జన్మస్థలమైన ఘంటసాల పాలెం గ్రామాభివృద్దికి తన వంతు సహకారం అందించటం సంతోషం గా ఉందని ఆయన తెలియ చేశారు.
గ్రామానికి చెందిన విజయకుమార్ వంట శాల నిర్మాణానికి విరాళం అందించారు.శ్రీ కొల్లూరి రాఘవయ్య గారు మండపానికి అవసరమైన కుర్చీలను తన వంతు సాయంగా అందించారు.గ్రామం లో అవసరమైన పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామాభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు.ఇంకా ఈ కళ్యాణ మండపానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు మరియు దివంగత మహా నేత N.T.R విగ్రహాన్ని ఈ ఆవరణలో ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు. ఎన్ టి ఆర్ కుమారుడు హరికృష్ణ నిశ్చితార్ధం ఘంటసాల పాలెంలో ఈ స్థలం లోనే జరిగింది. ఆ సందర్భంగా ఎన్ టి ఆర్ ఈ గ్రామానికి విచ్చేశారు. దానికి గుర్తుగా ఈ స్థలంలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు గ్రామ కమిటీ తెలియచేసింది. ప్రస్తుతం జాస్తి బలరామకృష్ణమూర్తి గారిని అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గా గ్రామస్తులు ఎన్నుకొన్నారు. గతంలో బలరామకృష్ణమూర్తి గారు ఘంటసాల ,చల్లపల్లి , పామర్రులో పోస్ట్ మాస్టర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు కిషోర్ హైదరాబాదులో పేరొందిన అభిరుచి స్వీట్స్ అధినేత.