నా ఐరోపా యాత్ర - 29 (చెక్ రిపబ్లిక్)Back to list

నా ఐరోపా యాత్ర - 29 (చెక్ రిపబ్లిక్)

హైదరాబాద్ లో ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ ఎదురుగా రోడ్డులోకి వెళితే జెక్ కాలనీ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అసలు జెక్ కాలనీ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీలో కలిసిపోయింది కాని ఒకప్పుడు ఇది సిటీ శివారు ప్రాంతం. అశోక్ లేలాండ్ , ఆల్విన్ , ఆస్బెస్టాస్ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉండేవి. దానికంటే ముందు నిజాం కాలంలో ఒక మందుగుండు ఫాక్టరీ ఇక్కడ ఉండేది. ఆ ఫాక్టరీ నిర్మాణ నిమిత్తం జెకోస్లోవేకియా దేశం నుండి ఇంజినీర్లని ఇక్కడికి పిలిపించారు. పిస్తోళ్ల తయారీకి చెకోస్లోవేకియా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే తుపాకులు ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి అవుతాయి. బహుశా అందుకే నిజాం నవాబు వారిని ఇక్కడికి పిలిపించి ఉండవచ్చు. ఆ ఫాక్టరీ నడిచినంత కాలం ఆ దేశం నుండి వచ్చిన ఇంజినీర్ల కోసం 50 బంగ్లాలు నిర్మించి ఒక కాలనీగా ఏర్పాటు చేసారు. విశాలమైన రోడ్లు , పార్కులతో కాలనీ ని అందంగా తీర్చిదిద్దారు. కాల క్రమేణా ఆ ఫాక్టరీ మూతబడటంతో ఆ దేశస్థులంతా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. చాలా కాలం వరకు ఆ బంగ్లాలు అలాగే ఉన్నాయి. కాలక్రమేణా అవన్నీ కూల్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు.ఆ జెక్ కాలనీ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదీ మనకి జెక్ రిపబ్లిక్ కి ఉన్న అనుభంధం.

 

 

 

 మే 6 వ తేదీన మా పర్యటన ముగించుకు వచ్చాక మళ్ళీ మే 11 వ తేదీన వీకెండ్ కావటంతో చెక్ రిపబ్లిక్ వెళదామని నిర్ణయించుకున్నాం. మార్చిన్ , కాషా కూడా ఆ దేశాన్ని చూడలేదు. ఒకప్పుడు ఈ దేశం పేరు చెకోస్లోవేకియా.1918 లో ఆస్ట్రియన్ హంగరీ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొంది చెకోస్లోవేకియా గా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల చేతుల్లో ఉంది. యుద్ధానంతరం సోవియట్ యూనియన్ తో కలిసి కొనసాగింది 1989 లో సోవియట్ యూనియన్ పతనం తరువాత స్వతంతరంగా అవతరించి 1993 లో శాంతియుతంగా రెండు దేశాలుగా విడిపోయింది. భూబాగంతో పాటు పేరుని కూడా సమానంగా పంచుకుని చెకోస్లోవేకియా నుండి చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా అనే రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. మేము ఇప్పుడు వెళ్ళబోతోంది అక్కడికే. మేమున్న మింజు జేర్జ్ నుండి ప్రాగ్ 360 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా వెళితే 4 గంటల ప్రయాణం. ఒక్కరోజులోనే వెళ్లి వద్దామని అనుకున్నాం. చెక్ కరెన్సీ పేరు క్రోనా. మన డబ్బుల్లో ఒక క్రోనా కి 2.50 రూపాయలు వస్తాయి. అదే ఒక యూరో కి 27 క్రోనాలు వస్తాయి.ఆరోజు ఉదయం త్వరగా బయలుదేరినా సగం దూరం వెళ్ళేటప్పటికి వర్షం మొదలైంది. వేరే ఇతర దేశాల వాహనాలు చెక్ రిపబ్లిక్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. దారిలో ఉండే అన్ని పెట్రోల్ బంక్స్ లో ఇవి ఉంటాయి.


మేము వెళుతున్న దారిలోనే స్కోడా కార్ల ఫాక్టరీ కనిపించింది. మనం వాడే స్కోడా కార్లకి పుట్టినిల్లు ఈ దేశమే. దారిలో ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మధ్యలో ఆగి అక్కడి పొలాలు , ఇళ్ళ మధ్య ఫొటోస్ తీసుకుంటూ వెళుతున్నాం. మధ్యలో ఒక చోట చిన్న రైల్వే క్రాసింగ్ వచ్చింది. అది ఆ దేశపు లోకల్ ట్రైన్ అనుకుంటా , మన ఊటీ లో తిరిగే చిన్న ట్రైన్ లా ఉంది. దాదాపు 4 గంటల 30 నిమిషాలు ప్రయాణించాక ప్రాగ్ చేరుకున్నాం. 1100 ఏళ్ల ఈ పురాతన పట్టణాన్ని స్థానికులు ప్రాహా అంటారు. జనాభా పదమూడు లక్షలు. ఇది చెక్ దేశంలోని అతిపెద్ద నగరం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చెకోస్లోవేకియాకి రాజధాని అయింది. స్లోవక్, చెక్ అధికారిక భాషలు. స్లోవక్ చెక్‌భాషలోని ఓ మాండలీకం. నలభై శాతం మంది దాన్నే మాట్లాడతారు.అసలు ఇక్కడ నిరుద్యోగమే లేదట. ముందు మా కార్ ని ఒక చోట భూగర్భంలో పార్క్ చేసేసాం.పార్కింగ్ ఖరీదు 180 క్రోనాలు.అక్కడికి దూరంగా ప్రాగ్ కేజిల్ కనిపిస్తోంది. దీని పేరు హ్రాడ్‌కని. పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించుకున్న వెయ్యి సంవత్సరాల ఈ కోట యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.


ప్రాగ్ మధ్యలో వ్లటావ నది ప్రవహిస్తుంది.ఆ నదికి రెండు వైపులా నగరం ఉంది. మేము ఆ ప్రాగ్ కాజిల్ కి ఇవతలి ఒడ్డున ఉన్నాం. దానిని చేరుకోవాలంటే వ్లటావ నదిని దాటాలి.చెక్ రిపబ్లిక్‌లో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే అతి పొడవైన నది వ్లటావా. ఇది నాలుగు వందల ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణించాక, మెల్‌నిక్ అనేచోట ఎల్బీ నదిలో కలుస్తుంది. వ్లటావా నది మీద 31 వంతెనలున్నాయి. వాటిలో అతి పురాతనమైనది చార్లెస్ బ్రిడ్జి. మేము ఛార్లెస్ బ్రిడ్జి మీదుగానే వ్లటావా ని దాటి అవతలకి వెళ్ళాలి. బొహీమియన్ శాండ్‌స్టోన్‌తో పూర్తయిన దీన్ని మొదట్లో స్టోన్‌బ్రిడ్జి లేదా ప్రాగ్ బ్రిడ్జి అనేవారు. పాతరోజుల్లో గుడ్డు సొనని సున్నంలో కలిపి దీన్ని నిర్మించారు. 1870 నించి మాత్రమే దీన్ని చార్లెస్ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి ఫెన్సింగ్ రాడ్లకి వేసిన వందలకొద్దీ తాళాలు చూసి నవ్వుకున్నాం. పారిస్ లో సీన్ నది ఒడ్డున కూడా ఇలాంటి తాళాలు చూసాం. వీటిని ‘లాక్స్ ఆఫ్ లవ్’ అంటారు. ప్రేమికులు ఇక్కడ తాళాలు వేస్తే వారి ప్రేమ సఫలీకృతం అవుతుందనే ఇక్కడివాళ్ళు నమ్ముతారు.1621 లో నరికిన మనుషుల తలలని ఈ బ్రిడ్జి మీద ఉంచి, చెక్ తిరుగుబాటుదారులు ప్రాగ్ కేజిల్‌కి రాకుండా ఆనాటి రాజు భయభ్రాంతులకి గురిచేశాడు. 1648లో స్వీడిష్ సైన్యం దాడి చేసినప్పుడు, ఈ బ్రిడ్జి మీద యుద్ధం చేయగా కొంత దెబ్బతింది. పూర్వం సైనికులు దీనిమీద నించి శత్రుసైన్యం వస్తోందేమోనని కాపలా కాసేవారు. ఎందుకంటే కోటలోకి ఈ బ్రిడ్జి మీద నించే వెళ్లాలి.ఇప్పుడు మేము కూడా ఈ బ్రిడ్జి మీదుగానే కోట లోకి వెళుతున్నాం.


ప్రాగ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మాత్రం బావున్నాయి. ట్రాము , బస్సులతోపాటు వ్లటావ నదిలో బోట్లు కూడా ఉన్నాయి. బ్రిడ్జి దాటి అవతలకి చేరుకున్నాక కొంత ఎత్తైన ప్రాంతంలోకి వెళ్లి ఎదురుగా ఉన్న ఓ గేటులోంచి లోపలకు నడిచాం. ఆ గేటుకి అటూ ఇటూ నీలం యూనిఫామ్‌లో ఇద్దరు గార్డులు అటెన్షన్‌లో నిలబడి ఉన్నారు. గంటకోసారి ఇక్కడ జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్స్ సెరమనీని పర్యాటకులు ఉత్సాహంగా గమనిస్తారు. ఆ గేట్ దాటి లోపలకి వెళ్తే ఎదురుగా పెద్ద కోర్ట్ యార్డ్. మధ్యలో ఓచోట ఆనాటి బావి. దాన్ని ఐరన్ మెష్‌తో మూసేశారు. దాని ఎదురుగా స్త్రీల ప్రాచీన మోనాస్ట్రీ, కుడివైపు 12వ శతాబ్దంలో నిర్మించిన రోమనెస్క్యూ ప్యాలెస్, ఎడమవైపు సెయింట్ వైటస్ కెథడ్రిల్ ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇక్కడే నివసిస్తున్నాడు. ప్రాగ్ లో అధ్యక్షుడు లేకపోతే ఆ భవనం పై జెండా ఉండదట.


అలాగే నడుచుకుంటూ వెనుక భాగాన ఉన్న సెయింట్ వైటస్ కెథడ్రిల్లోకి నడిచాం. అసలు ఎంత పెద్ద నిర్మాణం అది. మాకు తల ఎత్తి చూస్తే అసలు ఏమీ కనపడట్లా.దీని నిర్మాణం పూర్తవడానికి ఆరు వందల యేళ్లు పట్టిందట. 1344 లో చార్లెస్ IV దీని నిర్మాణాన్ని చేపట్టాడు. పదో శతాబ్దానికి చెందిన రొటుండా అనే భవంతిని పడగొట్టి, ఆ స్థలంలో ఈ కెథడ్రిల్ కట్టారు.  ఇది చెకోస్లోవేకియాలోని అతిపెద్ద చర్చి. దీన్ని గోథే ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. చెక్ రాజుల పట్టాభిషేకాలన్నీ ఇక్కడే జరిగాయి. సెయింట్ వెన్‌సెస్‌లాస్ మృతదేహాన్ని ఖననం చేశారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చెక్‌ని పాలించిన చార్లెస్ IV, ఆయన నలుగురు భార్యలు ఇక్కడే సమాధి చేయబడ్డారు. నవంబర్ 1344లో దీన్ని తెరిచారు. ఇది రాజుల పట్టాభిషేకానికి, సమాధులకి, రాజవంశీయుల ఆభరణాలని దాచడానికి ప్రధానంగా ఉద్దేశించబడింది.బొహీమియన్ రాజులు పట్టాభిషేక సమయంలో ఉపయోగించిన బంగారు ఆభరణాలు భద్రపరిచిన క్రౌన్ చాంబర్‌ ఇందులోనే ఉంది . ఆ గది తలుపులు తెరవడానికి ఎనిమిది తాళం చెవులు అవసరం అవుతాయి. చెక్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ మొదలైన ఎనిమిదిమంది దగ్గర ఈ తాళం చెవులు ఉంటాయి. వారంతా వస్తే కాని ఆ తలుపు తెరిచేందుకు వీలుపడదు.


కోట వెనక భాగంలోంచి కిందకి దిగి ఓ చిన్న సందులోకి వెళ్లాం. దాన్ని గోల్డెన్ లేన్ అంటారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ లేన్‌ని చూడటానికి పర్యాటకులు వస్తూండటంతో దాని యజమానులు తమ ఇళ్లు అపూర్వమైనవని గ్రహించి, వాటిని ఫర్నిచర్‌తో, రంగులతో అలంకరించి, కొన్ని నాణాలని తీసుకుని పర్యాటకులకు తమ ఇళ్లని చూపించసాగారు.1953లో చెకోస్లోవేకియా అధ్యక్షుడి కార్యాలయం, గోల్డెన్ లేన్‌లోని ఇళ్లన్నిటినీ కొనేసింది.
కొంతదూరం వెళ్లాక ఓ ఇరుకైన సందు ఉంది , అది ప్రపంచంలోని అతి చిన్న పాదచారుల సందు. ఒకళ్లు వెళ్తే ఇంకొకరు రాలేనంత చిన్న సందు కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్లని అమర్చారు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే వెళ్లాలి. లేదంటే మనిషి ఎదురొస్తాడు.మేము వెళ్ళగానే రెడ్ లైట్ ఉండటంతో కాసేపు ఆగాము. అక్కడి నుండి మళ్ళీ చార్లెస్ బ్రిడ్జి మీదుగా  నడుస్తూ టౌన్‌హాల్ స్క్వేర్‌కి చేరుకున్నాం. టౌన్‌హాల్ టవర్‌కి దక్షిణ గోడ దగ్గర 1410లో అమర్చిన ఓర్లోజ్ (ఆస్ట్రొనామికల్ గడియారం) ఉంది. ప్రపంచంలో ఉన్న అలాంటి మూడు గడియారాల్లో ప్రస్తుతం పనిచేసేది ఇదొక్కటే. టవర్ పైన ఉన్న ఈ డయల్ ఆకాశంలోని సూర్యచంద్రుల పొజిషన్‌ని, ఇతర ఖగోళ వివరాలని తెలియజేస్తుంది. కింద ఉన్న క్యాలెండర్ డయల్ నెలని చూపిస్తుంది. 14వ శతాబ్దంలో ప్రాగ్‌ని భూమికి కేంద్రంగా విశ్వసించేవారు. ఆ గడియారం మన సాలార్‌జంగ్ మ్యూజియమ్‌లో బొమ్మ బయటికి వచ్చి గంటలు కొట్టే లాంటి గడియారమే. ప్రాగ్ అంతా మరో పారిస్ లా అనిపించింది. కాకపొతే పారిస్ రాచరికంతో పాటు కొంత ఆధునిక ప్రపంచం కూడా కనిపిస్తుంది. ప్రాగ్ లో అన్నీ పాత వాసనలే ఉన్నాయి. మేము ఇవన్నీ తిరుగుతూ అసలు సమయం కూడా చూసుకోలేదు అప్పటికే సాయంత్రం 8 గంటలు అయ్యింది.అక్కడే కె ఎఫ్ సి లో డిన్నర్ కానిచ్చ్చేసి మళ్ళీ పోలాండ్ వైపు పయనమయ్యాం.

 

 

Dated : 24.11.2015