నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)Back to list

 

నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)

బ్రస్సెల్స్ నుండి నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాం కి 250 కిలోమీటర్లు. సరిగా మధ్యాహ్నం 1.30 గంటలకి ఆటామియం నుండి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణించాక గూగుల్ మాప్స్ లో చూస్తే బెల్జియం - నెదర్లాండ్స్ బోర్డర్ అని కనిపించింది. హైవే మీద ఉన్న మెక్ డొనాల్డ్స్ దగ్గర లంచ్ కోసం కార్ ఆపాడు మార్చిన్. గంట తరువాత మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది.

క్రీ.పూ. 53లో జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. దాదాపు నాలుగు శతాబ్దాలు రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రమంగా ఫ్రాంక్ రాజులు రోమన్‌లను పారద్రోలి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రమక్రమంగా వివిధ రాజులు పాలిస్తూ వచ్చారు. 6వ శతాబ్దంలో ఫ్రిసియన్ రాజులు పాలించారు. తిరిగి 10వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. కాని వీరి పాలనలో ఐకమత్యం లేక స్థానికంగా చిన్న చిన్న డచ్చివారి ప్రైవేటు సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దంలో ఇండోనేయల్, ఫ్రెంచి రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 17వ శతాబ్దంలో డచ్చి పాలకులు మొత్తం నెదర్లాండ్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి పరిపాలనను గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 17, 18 శతాబ్దాలలో బటావియన్ రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. 19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీలు పరిపాలించాయి. క్రీ.శ.1581లోనే స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటింపబడినా, 1954లో స్వతంత్ర దేశంగా ఏర్పాటయింది.ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 404 మంది నివసిస్తున్నారు. ప్రజలు డచ్చి భాషను మాట్లాడుతారు ఇక్కడి ప్రజలు వాళ్ళ స్వంత భాషతో పాటు జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడి ప్రజలంతా క్రైస్తవులు, వీరిలో క్యాథలిక్కులు అధికం. జనాభాలో అధికశాతం ప్రజలు దేవుణ్ణి నమ్మరు. దేశంలో బౌద్ధులు, హిందువులు ముస్లిముల జనాభా కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది.

నెదర్లాండ్స్ లో ప్రవేశించగానే మనకి కనిపించేవి విండ్ మిల్లులు. అంటే పెద్ద ఫాన్ ని ఒక టవర్ కి పైన బిగించి అది గాలికి తిరుగుతున్నపుడు ఆ శక్తి తో కింద పిండి మర నడిపిస్తారు. పూర్వ కాలంలో రొట్టెలు తయారు చేయటానికి పిండిని ఇలాగే తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి గాలి మరలు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ సంస్కృతి ని కూడా ఇవి తెలియచేస్తుండటంతో కొన్ని పాత మిల్లులని అలాగే ఉంచేశారు. భార్గవి , కాషా నెదర్లాండ్స్ లో ఉండే తులిప్ తోటల ని చూడబోతున్నామనే ఉత్సాహంతో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళకి సహజంగానే పూలంటే ఇష్టం అందునా తులిప్ అందాలని వెండితెరమీద చూసిన తరువాత ఒక్కసారైనా ఆ తోటల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. కాని నా మనసంతా అన్నే ఫ్రాంక్ హౌస్ చుట్టూనే తిరుగుతోంది. నన్ను ఈ యాత్ర చేయటానికి , ఈ పుస్తకం రాయటానికి ప్రేరేపించిన రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన రోజు ( మే 4, 1945) రోజే నా ఐరోపా యాత్ర చివరి మజిలీ చేరుకోవటం , అన్నిటి కంటే ఆఖరున నన్ను అత్యంత ప్రభావితం చేసిన అన్నే ఫ్రాంక్ హౌస్ సందర్శించటం అక్కడే మా యాత్రకి ఆఖరి రోజు కావటం అంతా యాదృచ్చికం. రెండవ ప్రపంచ యుద్ధంలో కాన్సంట్రేషన్ కాంపుల్లో చంపబడ్డ లక్షలాది యూదులు , చిన్నారులలో అన్నే ఫ్రాంక్ అనే చిన్నారి కధ మాత్రమే ప్రపంచానికి తెలిసింది.1939 -1945 మధ్య కాలం లో జరిగిన మానవ హననంలో లక్షలాది యూదు చిన్నారుల జీవితాలు నాజీల దౌష్ట్యం కారణంగా చిద్రమై పోయాయి. ఎన్నో చిన్ని గుండెలు వారి ఇనప బూట్ల పాదాల కింద నలిగిపోయాయి. 1929 జూన్ 12 న జర్మనీలో Frankfurt లో  జన్మించింది అన్నే ఫ్రాంక్ . వారిది యూదు కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్, అందమైన కుటుంబం, 1935 లో నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు.1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .జర్మనీ లో యూదులకి రక్షణ లేదని అర్ధమైన వెంటనే అన్నే ఫ్రాంక్ తండ్రి తమ కుటుంబాన్ని హాలండ్ కి మార్చాడు. తన వ్యాపారాన్ని తోటి జర్మన్ మిత్రులకి అప్పగించాడు. యూదులు ఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కోవాల్సిన గతి పట్టింది .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఒక అపార్ట్మెంట్ లో పై భాగంలో ఉన్న చిన్న అరల్లో 25 నెలలు జీవితాన్ని గడిపింది.ఈ విషయాన్ని అన్నే secret annex అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజున ఎవరో ఒక డైరీని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి దిన చర్య రాయటం ప్రారంభించింది .అలా ఆ రెండు సంవత్సరాల్లో ఆమె రాసిన తన దినచర్య , తాను గడిపిన ఆ రెండేళ్ళ రహస్య జీవితం గురించి రాసిన విశేషాలు ఎ డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ గా పేరుగాంచింది. కాని దురదృష్టవశాత్తు ఎవరో వీళ్ళ గురించి సమాచారం ఇవ్వటంతో నాజీలు 1944 సెప్టెంబర్ 3 న దాడి చేసి కుటుంబం మొత్తాన్ని పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు .

            ఆడవాళ్ళను ,పిల్లల్నిబట్టలు ఊడ దీయించి వర్షం లో నిలబెట్టారు. అన్నే ఫ్రాంక్ తండ్రిని మాత్రం వేరే కాంపుకి తరలించారు. అన్నే ఫ్రాంక్ అక్క మరియు తల్లి తన కళ్ళముందే బెల్షన్ కాంపులో చనిపోయారు. కొన్ని రోజులకి 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్ టైఫాయిడ్ సోకి 1945 మార్చ్ లో అదే కాంప్ లో మరణించింది.

యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాత వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . 1945 లో యుద్ధం ముగిశాక బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు. అయితే వేరే కాంప్ లో ఉన్న అన్నే ఫ్రాంక్ తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి, వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ డైరీ కున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి వినిపించానని రాశాడు. ఈ పుస్తకమ్మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. నటాలీ పోర్ట్‌మన్ అనే అమెరికన్ నటి 1997లో ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. నటాలీ పోర్ట్‌మన్ కూడా రెండవప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయిల్ వెళ్లి స్థిరపడ్డ యూదు కుటుంబానికి చెందిన యువతి. ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది.అన్నే ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేర ఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకారమైన పనులు చేస్తున్నారు . ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు . అన్నే నివసించిన అరలు , ఆమె తాలూకు వస్తువులు , డైరీ ఒరిజినల్ ప్రతి , అన్నే ఫ్రాంక్ చిన్న వీడియో క్లిప్ ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు నేను చూడాలని అనుకున్నది అన్నే ఫ్రాంక్ మ్యూజియంగా పిలవబడుతున్న ఈ సీక్రెట్ అనెక్స్ అనే హౌస్. మార్చిన్ కి ఈ కధంతా తెలుసు , ఇలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారు కాని అన్నే ఫ్రాంక్ తండ్రి ధనవంతుడవ్వటం వల్ల ఇంతటి ప్రాచుర్యం వచ్చిందంటాడు మార్చిన్. ఇలా నా ఆలోచనలు అన్నే ఫ్రాంక్ చుట్టూ తిరుగుతుండగానే మేము అమ్ స్టర్ డాం లోకి ప్రవేశించాం. ఆరోజు బాగా చలిగా ఉంది అక్కడ. మేము బయలుదేరినప్పుడు బ్రస్సెల్స్ లో అంత చలిగా లేదు. మేము నేరుగా అన్నే ఫ్రాంక్ హౌస్ దగ్గరికి వెళ్ళాం, కాని అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు అవ్వటంతో ప్రవేశం నిలిపివేశారు. ఎలాగు మేము బస చేసేది ఆ రాత్రికి నెదర్లాండ్స్ లోనే. రేపు చూద్దాంలే అని సిటీ చూడటానికి కాలి నడకన బయలుదేరాం. 

అమ్ స్టర్ డాం ఇంచుమించు వెనిస్ లాగే అనిపించింది. అమ్ స్టాల్ అనే నది ఈ నగరం గుండా ప్రవహిస్తోంది. ఈ నది కెనాల్ లోనే బోటులో సందర్సకులంతా విహారానికి వెళుతున్నారు. ఒకరకంగా ఇది Venice of north europe అనవచ్చు. ఓపెన్ బోట్స్ తో పాటు హౌస్ బోట్స్ కూడా ఈ కెనాల్స్ లో ప్రయాణికులని చేరవేస్తున్నాయి. మాకు కార్ల కంటే ఎక్కువగా సైకిళ్ళు కనిపించాయి.ఎక్కువమంది సైకిల్లనే వాడుతున్నారు. సైకిళ్ళు అద్దెకిచ్చే షాపులు ఎక్కువగానే ఉన్నాయి. గంటకి అద్దె 5 యూరోలు అని రాసి ఉంది ఒకచోట. అలా మేము నడుస్తుండగానే జనాలంతా ఒకే వైపు వడి వడిగా పరుగులు పెట్టటం కనిపించింది. ఏమి జరుగుతోందో అని మేము కూడా అటు వైపు వెళ్ళాం. తీరా చూస్తే అది అమ్ స్టర్ డాం నగర కూడలి. అతి పెద్దదైన రాజ భవనాలు , టుస్సాడ్ మ్యూజియం మధ్యలో ఈ సిటీ కూడలి ఉంది. 15 నిమిషాల్లో దాదాపు 10000 మంది పోగయ్యారు. మాకు అప్పుడు కాని అర్ధం కాలేదు, బ్రస్సెల్స్ లో మేము చూసిన యుద్ధం ముగిసిన రోజు వేడుకలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందరి మొహాల్లో విషాదం. కొంతమందైతే ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు అంతా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాసేపటికి నెదర్లాండ్స్ రాజు తన సతీమణితో కలిసి ఆ కూడలి లో ఉన్న ఒక స్థూపం దగ్గరికి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన యూదులకి సైనికులకి అశ్రు నయనాలతో నివాళి అర్పించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు అందరూ మౌనం పాటించారు. 10000 మంది ఓపెన్ ఏరియా లో ఉన్నా సూది పడినా విన్పించే నిశ్శబ్దం ఆవరించింది. మేము కూడా వారితోపాటు అక్కడే నిలబడి నివాళి అర్పించాము.

అప్పటికి సమయం సాయంత్రం 8 గంటలు అయ్యింది. ఇంకా చీకటి పడలేదు సూర్యుడు అప్పుడే అస్తమించే దశలో ఉన్నాడు. మేము అక్కడినుండి మళ్ళీ నడుచుకుంటూ మా కార్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాం. అమ్ స్టర్ డాం లో చెప్పుకోవాల్సింది కాఫీ షాప్స్. నాకు వాటి వెనుక కధ తెలియదు , మార్చిన్ నవ్వుతూ అడిగాడు కాఫీ తాగుదామా అని. ప్రతి కాఫీ షాపులోనూ విపరీతంగా జనాలు ఉన్నారు. సిగరెట్ పొగ, కాఫీ వాసనలతో ఆ షాపులన్నీ సందడిగా ఉన్నాయి. నన్ను మార్చిన్ ఒక షాప్ లోకి తీసికెళ్ళాడు. అక్కడ ఒక ఆకు బొమ్మ వేసి Its Legal Here అని రాసి ఉంది. దానితోపాటు గాజు సీసాల్లో రకరకాల ఎండిన ఆకులు ఉన్నాయి. వాటితో తయారు చేసే రకరకాల కాఫీ మెనూ ఉంది అక్కడ. మార్చిన్ ఎందుకు నన్ను కాఫీ తాగుతావా అని అడిగాడో అర్ధం అయ్యింది. అవన్నీ మన గంజాయి తరహా రకరకాల ఆకులు. ఆ కాఫీ తాగితే ఒకరకమైన నషా వస్తుంది. అక్కడ ఇదంతా కామన్ మరియు ప్రభుత్వ పరంగా అనుమతి కూడా ఉంది. అన్నిటితో పాటు నేను గమనించిన మరో ఆసక్తి కరమైన అంశం, అక్కడ అన్ని షాపుల్లో మన వినాయకుడి ఫోటోలు ఉన్నాయి. మార్చిన్ కి కూడా ఆ ఫోటో తెలియదు అప్పుడు నేను ఆవర్ ఇండియన్ గాడ్ అని చెప్పాను. అవి ఎందుకు పెట్టారో అడగాలని రెండు మూడు షాపుల్లోకి వెళ్లాను కాని అక్కడ వాతావరణం చూసి ధైర్యం చాలలేదు.

అలా చూసుకుంటూ ముందుకి రాగానే ఒక మీటింగ్ పాయింట్ కనపడింది. 200 మందికి పైగా అబ్బాయిలంతా అక్కడ ఉన్నారు. కొంతమంది అక్కడ నదిలో దీపాలు వదులుతున్నారు. ఏం జరుగుతోందో చూద్దామని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎదురైన దృశ్యం చూసి భార్గవి నా చేతిని గట్టిగా పట్టుకుని ఛీ ఛీ అంటూ వెనక్కి తిరిగింది. మార్చిన్, కాషా కూడా ఏమైంది అంటూ వచ్చి వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి మాక్సిం కళ్ళు మూసేసి వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ? 

Dated : 20.11.2015