​కూడు పెట్టేది నైపుణ్యమే - ఇంగ్లీష్ కాదు​Back to list

 (18-02-2013వ తేదీన ప్రజాశక్తిలో ప్రచురితం)

 
కూడు పెట్టేది నైపుణ్యమే – ఇంగ్లీషు కాదు
 
ఉద్యోగం రావాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా రావాలని, ఇంగ్లీషే ఈ ప్రపంచాన్ని ఏలబోతోందనీ, మిగతా భాషలు చచ్చిపోయినా బాధపడక్కరలేదనీ ప్రతి ఒక్కరు ఇంగ్లీషు నేర్చుకొంటేనే మన సమస్యలన్నీ పరిష్కారమౌతాయన్నంతగా ఇటీవల ప్రచారం జరుగుతోంది.
 
నేను అల్లోపతి డాక్టర్ని. నా దగ్గరకు వచ్చే రోగుల్లో వ్యవసాయదారులు, గృహిణిలు, వ్యాపారస్తులు, కులవృత్తులు చేసుకునేవారు, రోజువారి కూలి పని చేసుకొనేవారూ ఉంటారు. గత 35 సంవత్సరాలలో వారెవ్వరూ నన్ను వైద్యంలో సలహా సంప్రదింపుల కోసం తప్ప, వ్యవసాయంలో సందేహాలు గానీ, ఏ కూర ఎలా చేయాలని గానీ, వారి వ్యాపారాలలోగానీ, కుల వృత్తులలోగానీ వచ్చిన ఇబ్బందులకు నా నుండి సమాధానాలు కావాలని ఎవ్వరూ అడగలేదు. ఎందుకంటే నాకు వాటిల్లో నైపుణ్యం లేదని వారికి తెలుసు. నాకున్న నైపుణ్యం “వైద్యమే” కాబట్టి వైద్య సలహాలు కాక మిగతా సలహాలు కోరలేదు. నాకున్న ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని కూడా ఎవ్వరూ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. నన్ను వైద్యుడిగా నిలబెట్టింది వైద్యంలో నాకున్న నైపుణ్యం తప్ప నా ఇంగ్లీషు కాదు. వృత్తిపరమైన జ్ఞాన సముపార్జనకు, కాన్ఫరెన్సులకు ప్రక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాల పర్యటనలప్పుడు నాకున్న ఇంగ్లీషు పరిజ్ఞానం ఉపయోగపడింది. ఇంటర్మీడియెట్ స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకున్న మా తరానికి ఇంగ్లీషులో వైద్యవిద్య నభ్యసించడానికి పెద్దగా ఇబ్బంది పడింది లేదు. 3-4 నెలల్లో ఆ భాషకు అలవాటయిపోయాము. వైద్య కళాశాలలో మా తరంలో ఎల్.కె.జి. నుండీ ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవారు కూడా కొందరు ఉండేవారు. తర్వాత జీవితంలో బాగా రాణించడంలో “వైద్యంలో నిపుణత”, “వృత్తిలో అంకిత తత్త్వం”, “సమాజం పట్ల ప్రేమ” ముఖ్యపాత్ర వహించాయి కానీ వారికున్న ఆంగ్లభాషా పరిజ్ఞానం కాదు.
 
చల్లపల్లిలో ఒక సాధారణ ఆర్థికస్థాయిగల కుటుంబంవాడైన డా. నళినీ కుమార్, అమెరికాలోని “యేల్” యూనివర్శిటీలో సైంటిస్ట్ గా ఎదగడానికి కారణం అతనికి జీవశాస్త్రం పట్ల ఉన్న అనురక్తి. ఇంటర్ వరకు తెలుగులోనే చదివిన ఆయన స్వీడన్ లో పరిశోధన చేయాల్సివచ్చినప్పుడు అతి తక్కువ కాలంలోనే ఆంగ్లభాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఏ కొత్త భాషనైనా అవసరం అయితే నేర్చుకోవడానికి 3 నుండి 6 నెలలు చాలు అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు గదా!
 
చల్లపల్లి మండలం, బొబ్బర్లంక దళితవాడకు చెందిన మాతంగి కోటేశ్వర రావు 10 భాషలలో అనర్గళంగా సంభాషించగలడు. అతడు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 9 వరకే చదువుకున్నాడు. అతను మంచి ఎలక్ట్రీషియన్. అతన్ని ఉద్యోగంలో పెట్టుకున్న కాంట్రాక్టరు గారు ఏ ప్రదేశానికి వెళ్ళమన్నా ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు. ఇంగ్లీషు కంటే ముందు అతనికి తెలుగు కాక తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలి, నైజీరియాలోని రెండు భాషలు వచ్చు. మేం అతన్ని ఇంటర్వ్యూ  చేసే సమయానికి టాంజానియా వెళ్ళడానికి సిద్ధమౌతున్నాడు. అక్కడ భాష మీరు నేర్చుకొనే వెళ్తున్నారా అని అడిగితే, నవ్వి “అక్కడ ఏ భాషో నాకు తెలియదు, ఎక్కడకు వెళ్ళినా 3 నెలల్లో ఆ ప్రాంతపు భాష నేర్చుకోగలను” అని ధైర్యంగా చెప్పాడు. అతడు తన జీవితాన్ని గెలుచుకోవడానికి అతనికి ఉన్న ఎలక్ట్రికల్ నైపుణ్యం ఉపయోగపడిందే కాని ఇంగ్లీషు కాదు.
తమిళనాడులోని పర్యాటక ప్రదేశాలలో కిరాయి కార్ల డ్రైవర్లు హిందీలో చక్కగా మాట్లాడటం గమనించాను. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగి హిందీని  భాషగా స్కూళ్ళలోనుండి తరిమేసి చాలా కాలం అయ్యింది. అయినా వారికి ఎలా అ భాష వచ్చింది అని అడిగితే “ఉత్తర భారతదేశ యాత్రికులతో సంభాషించాలి కదా అందుకని మాకు వచ్చేస్తుంది” అని వారి సమాధానం. అవసరం వారికి కొత్త భాషను నేర్పింది.
 
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఖ్యాతి తెచ్చింది ఆయన నటనా నైపుణ్యమే గానీ ఇంగ్లీషు కాదు. ఇంగ్లీషు నేర్చుకొన్నాక మరింత ఎక్కువమందితో భావ వ్యక్తీకరణ చేయగలగడం ఆయనకు అదనపు సౌకర్యం మాత్రమే. తన అద్భుతమైన మిమిక్రీతో, నటనా సామర్ధ్యంతో మన తెలుగు రత్నం “జానీ లివర్” హిందీ సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు కానీ అతని ఇంగ్లీషు భాషా పాండిత్యంతో కాదు.
 
“రామన్ మెగసెసే” అవార్దు గ్రహీత మహారాష్ట్రకు చెందిన “డా. రజనీకాంత్ అరోలి” వద్ద కృత్రిమ అవయవాల తయారీ విభాగం అధిపతి, తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన దళితుడు. అతడు 4వ తరగతితోనే చదువు ఆపేసాడు. తన సొంత భాష కాక మరాఠీ, హిందీ, ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలకు వెళ్ళి కృత్రిమ అవయవాల తయారీకి శిక్షణ యిచ్చి వస్తుంటాడు. ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు, ఎంతకాలం శిక్షణ పొందావు అని అడిగాను. ఎక్కడా శిక్షణ పొందలేదని, వారి సంస్థకు విదేశీయులు కొందరు వస్తున్నారని, వారితో వ్యవహరించవలసి రావడంతో ఇంగ్లీషు వచ్చేసింది అని చెప్పాడు. ఇతనికీ అవసరమే ఆంగ్ల భాష వంటబట్టడానికి కారణం.
 
అమెరికా అధ్యక్షుడు “జార్జి బుష్” హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో చక్కగా సంభాషించిన “గడ్డం అనిత” అవనిగడ్డ మండలంలో ఒక కుగ్రామంలో పుట్టి హైస్కూల్ స్థాయి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నది. ఐ.ఐ.టి. కాన్పూర్ లొ అద్భుతంగా రాణించిన “గడ్డం జాషువా సునీల్” హైస్కూల్ చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. ఇటువంటి ఉదాహరణలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు.
 
సమాజంలో ఎక్కువ ఉద్యోగాలు, సైన్సు, సోషల్, లెక్కలు పునాదిగా ఉంటాయి. భాషా పండితుల అవసరం కొద్దిమేరకే. అందుకే వారికి తక్కువ శాతం ఉద్యోగాలు ఉంటాయి. పై మూడు శాస్త్రాలు బాగా అర్ధం కావాలంటే పాఠశాల విద్య పిల్లల సొంతభాషలో ఉంటేనే సాధ్యం. సొంతభాషలో పునాదులు ఏర్పడిన తర్వాత ఎన్ని భాషలైనా తేలికగా నేర్చుకోవచ్చునని భాషా శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెప్తున్న విషయమే. ఇంగ్లీషుని 3వ తరగతిలో ప్రవేశపెట్టి “రెండవ భాషా బోధనా పద్ధతుల” ప్రకారం బోధిస్తే 10వ తరగతి పూర్తి అయ్యేటప్పటికి ఇంగ్లీషు మాట్లాడటం ఒక సమస్యే కాదు. అలా కాకుండా 1వ తరగతి నుండీ ఇంగ్లీషులో పై మూడు శాస్త్రాలు బోధిస్తే (అర్ధం కాని భాషలో అర్ధం కాని విషయం) ముందు ముందు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలకు పునాదులే లేకుండా పోతాయు.
 
శ్రీ చుక్కా రామయ్య గారు చెప్పినట్లు . . . ప్రాథమిక విద్యాబోధన ఇంటి భాషలోనూ, హైస్కూల్ విద్యాబోధన తెలుగులోనూ ఉండాలి. అందరూ ఆంగ్లం నేర్చుకోవడానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ భాషను భాషగానే నేర్పాలి. సైన్సు ద్వారా, లెక్కల ద్వారా, సోషల్ ద్వారా ఇంగ్లీషు నేర్పడం అనేది అశాస్త్రీయం. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ప్రయోగం జరుగలేదు.
 
ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య గారు ఒక వ్యాసంలో వ్రాసిన ఈ మాటలు నాకు పదే పదే గుర్తు వస్తుంటాయి. “దళిత బహుజనుల్లో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకొన్నారు, గెలుచుకొంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రభుత్వం పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే, అసంఖ్యాక బడుగు జనుల పిల్లలు ధనికుల పిల్లల్లాగే తమ మూలాలకు దూరమై, యంత్రాలుగా మారి అన్నివిధాల ఓడిపోతారు”.
 
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి, చల్లపల్లి
కృష్ణాజిల్లా-521 126
సెల్ : 9885051179